ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర అధికారులను తెచ్చి పెట్టుకొని, చెంచాలుగా మార్చుకొని రాష్ట్రాన్ని దోచుకుంటుండని, కుట్రలు చేస్తున్నాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సుధాకర్ రావు 37 రోజుల పాదయాత్ర ముగింపు సభకు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీ ఒత్తిడితో కెసిఆర్ ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చి తిరుగుతున్నడన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజల ఓట్లతో గెలిచి నేడు ప్రజలను మోసం చేస్తుండన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసిండానీ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. 5 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణ ప్రతి తలపై లక్ష రూపాయల భారం మోపాడన్నారు.
కేంద్ర నిధులను దారి మళ్లించి.. మోడీపై విమర్శలా?
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తే వాటిని కేసీఆర్ దారి మళ్లించారని బండి సంజయ్ పేర్కొన్నారు. పైగా మోడీ పైనే కెసిఆర్ విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ నిధులు దోచుకున్న దొంగ కేసీఆర్ అని ఘాటుగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే సహించం
కేసీఆర్ ఆంధ్రలో రాజకీయం చేయడానికి పోతున్నాడు కానీ. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే సహించబోమని బండి సంజయ్ కేసీఆర్ ను హెచ్చరించారు. ఆంధ్ర అధికారులను చేతుల్లో పెట్టుకొని చెంచాలుగా వాడుకుంటూ తెలంగాణ ప్రజలపై ప్రతాపం చూపిస్తూ, రాష్ట్ర సంపాదన దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సిఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ ప్రజల ఉసురు తాకిందన్నారు.
సీఎస్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రజలు భారతీయ జనతా పార్టీ ఆదరించి,ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. అంత ముందుకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కు పూలు చల్లి నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు.