ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన పురపాలక ఎన్నికల ఫలితాలు అధికార వై ఎస్ ఆర్ పార్టీకి అనూహ్య విజయాన్ని కట్టబెట్టాయి. 75 మునిసిపాలిటీలకు గాను 73 చోట్ల, ఓట్ల లెక్కింపు జరిగిన మొత్తం 11 నగరకార్పోరేషన్ లలో జగన్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. కాగా ఏలూరు కార్పొరేషన్ లెక్కింపు వాయిదా పడింది.
ఇటీవల జరిగిన గ్రామస్థాయి ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహించడంతో అధికార , ప్రతిపక్షాలు గెలిచిన వారిని వారి వారి ఖాతాలలో చూపించి గందరగోళం సృష్టించాయి.
అయితే…పురపాలక ఎన్నికలు పార్టీ గుర్తులతో నిర్వహించడంతో వై ఎస్ ఆర్ సీ పీ, టీడీపీ , బీజేపీ , జనసేన , వామపక్షాలు తమ ఉనికిని చాటుకున్నాయి. ఈ ఎన్నికలలో వైఎస్ ఆర్ సీ పీ ఒంటరిగా పోటీచేయగా…టీడీపీ అనధికారికంగా వామపక్షాలతో, బీజేపీ జనసేనతో పొత్తుపెట్టుకున్నాయి. మరి కొన్ని చోట్ల టీడీపీ జనసేన పార్టీలు అనధికారికంగా సహకరించుకున్నాయి.
జగన్ ప్రభుత్వ పనితీరుపై రెఫరెండంగా భావించిన పురపాలక ఎన్నికలలో అధికార వై ఎస్ ఆర్ సీపీ మిగిలిన రాజకీయపార్టీలపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించడం పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. పాలక పార్టీ జనరంజకంగా అమలుచేస్తున్న ‘నవరత్నాలు’ పార్టీవిజయానికి దోహదపడినట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
జగన్ పాలనపట్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసాయని వై ఎస్ ఆర్ సీ పీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా..జగన్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన వివాదాస్పద మూడురాజధానుల అంశానికి ఏకపక్ష ప్రజామోదం లభించినట్లు పార్టీనేతలు విశ్లేషిస్తున్నారు. విజయవాడ , విశాఖపట్నం, కర్నూలులలో
వై ఎస్ ఆర్ సీపీ పార్టీ ఘనవిజయం సాధించడంతో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఉన్నట్లు తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలు ఉత్సాహం ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉండగా… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ తీరును తప్పుపడుతోంది. అధికార దుర్వినియోగం, విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బు పంపిణీ, కార్యకర్తలను బెదిరించడం , టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం.. వంటి అక్రమాలతో జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను భ్రష్టుపట్టించిందని తీవ్రంగా విమర్శించింది. ఎస్ ఈ సీ కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో విఫలమైందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాలలో తీవ్ర నిరాశ
అర్బన్ ప్రాంతాలలో అధికారపార్టీపై పెరిగిన వ్యతిరేకత , అసంతృప్తిని పురపాలక ఎన్నికలఫలితాలు రుజువు చేయగలవని ఆశించిన ప్రతిపక్షాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. పట్టణాలు, నగరాలలో కూడా వై ఎస్ ఆర్ సీ పీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో విపక్షాలు ఖంగుతిన్నాయి.
వై ఎస్ ఆర్ సీ పీ విజయావకాశాలను దెబ్బతీయగలవని బీజేపీ, జనసేనకూటమి పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి.
కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా… కోస్తాప్రాంతంలో జనసేన ఓటుబ్యాంకు పెరిగినట్లు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని స్థానాలలో జనసేన పార్టీ రెండవ స్థానంలో ఉండడం పరిశీలకుల చర్చలలో ఆసక్తికరంగా మారింది.
బిజెపి ప్రభావం శూన్యం
భాజాపా ప్రభావం అంతగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల…రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై జరిగిన వరుస దాడుల ప్రభావం పురపాలక ఎన్నికలప్రభావం పై కొంతమేరకు ఉండగలదని భాజాపా ఆశించింది. కానీ..ప్రజలు ఏకపక్షంగా వై ఎస్ ఆర్ సీ పీ ని గెలిపించడంతో భాజాపా అంచనా వీగిపోయింది.
ప్రజాస్వామ్యవ్యవస్థ లో ప్రజాతీర్పు శిరోధార్యం. కనుక రాజకీయపార్టీలు గెలుపోటములను హుందాగా స్వీకరించక తప్పదు.
పొలమరశెట్టి కృష్ణారావు