తమిళనాడు రాష్ట్రానికి తాగునీరివ్వడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతిభవన్ లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, పబ్లిక్ వర్క్ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, సలహాదారు ఎం.షీలా ప్రియ తదితరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయి తమ రాష్ట్రానికి తాగునీరివ్వాలని అభ్యర్థించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో అధికారులు ఎస్.నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, సీఈలు మురళీధర్ రావు, నరసింహారావు పాల్గొన్నారు.
వారి అభ్యర్థనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్, ఒడిషా ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున, తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అధికారికంగా లేఖలు రాయాలని వారికి సూచించారు. అనంతరం మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయిలో సమావేశం జరపాలని, ఆ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా నివేదిక తయారు చేయాలని కోరారు.
తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులంతా ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. ఈ కార్యాచరణ సిద్ధమైతే మూడు రాష్ట్రాలు దేశానికే ఆదర్శంగా మారుతాయన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాల మధ్య సహన పూరితమైన వాతావరణం ఉండాలని, పొరుగు రాష్ట్రాలు దయతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
తమిళనాడు తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ సమావేశాల్లో తాను పలుమార్లు లేవనెత్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే విషయంపై లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా రెండుసార్లు మాట్లాడారన్నారు. వాస్తవానికి తాగునీటి సమస్యతో తమిళనాడు బాధపడుతున్నందుకు దేశమంతా సిగ్గుపడాలన్నారు.
దేశంలో లభించే మొత్తం 70 వేల టీఎంసీల నీటిలో సాగునీటి అవసరాలు తీర్చగా, మరో 30 వేల టీఎంసీల నీరు మిగిలే ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో కేవలం 10 వేల టీఎంసీల నీరు మాత్రమే దేశంలో తాగునీటి అవసరాలకు సరిపోతుందని అన్నారు.
తాగునీటి విషయమై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని కలిగి ఉండాలని ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి సీఎం కేసీఆర్ సూచించారు. అత్యంత ప్రాధాన్యతా అంశమైన తమిళనాడు తాగునీటి అవసరాలపై దేశవ్యాప్తంగా అవగాహన అవసరమనీ, అందరూ సహృదయంతో అర్ధం చేసుకున్ననాడే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు.
పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిగా, భారతీయుడిగా తమిళనాడుకు సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తమిళనాడుకు తాగునీటి కోసం ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం అభ్యర్థన గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. ఇందుకు తాను సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని, ఈ సమస్య పరిష్కారం కోసం తమిళనాడు ప్రతినిధి బృందం సభ్యులకు తాను ఇచ్చిన సూచనలను జగన్ కు వివరించారు. తమిళనాడులో తాగునీటి బాధలు తెలిసిన విషయమే కాబట్టి, ఆ రాష్ట్రానికి నీరందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలిపారు.