శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష పాత ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష సంఘ ప్రధాన కార్యదర్శి బి కాంతారావు (నాని) బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో 20 మంది అధ్యాపకులు జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడటానికి ఆయన కారణమని నాని ఆరోపించారు.
గత ఏడాది కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులు ఒప్పంద అధ్యాపకులుగా పని చేసేవారని వారు అందరూ విద్యార్థులకు పాఠాలను బోధించడం, రాత్రి వరకూ కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించడం, ప్రాక్టికల్స్ నిర్వహించడం , విద్యార్థులకు పరీక్షలు పెట్టి మేధస్సు పెంచడం చేశారని నాని అన్నారు.
ప్రభుత్వం ప్రధాన పరీక్షల్లో పరిశీలన పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం, ఎన్నికల విధులు నిర్వహించడం, బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారని నాని తెలిపారు.
అయితే ఈ యేడాది వీరిని విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని నాని తెలిపారు. ఈ అధ్యాపకులకు ఉద్యోగ నియామక పత్రంలో లోపం ఉండడంతో ఏడాది ఉద్యోగంలో కొనసాగించలేదని, దీనికి కారకులైన శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష పాత ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష జేఏసీ డిమాండ్ చేసింది.