విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి ఎడిటింగ్ చేసే పనిలో పడ్డారు. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో సర్ప్రైజ్ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీ సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకు మించి నేనేం చెప్పలేను’ అంటూ ట్వీట్ చేశారు రష్మిక. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ తొలి మూడు రోజులు సెలవుల కావటంతో మంచి వసూళ్లు సాధించింది. సోమవారం కూడా తెలంగాణలో బోనాలు సెలవు ఉండటంతో ఇక్కడ మంచి కలెక్షన్లు వచ్చినా ఆంధ్రాలో మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితిలో చిత్రయూనిట్ చేసిన మార్పులు సినిమాను ఎంతవరకు కాపాడతాయో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.