సోషల్ మీడియా, ఇతర మీడియాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు, కథనాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి బుగ్గన మీడియాతో గురువారం మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చడానికి కొన్ని ప్రధాన పత్రికలు, మీడియా ఛానళ్లు, రాజకీయ నాయకులు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనంతపురంలో కొనసాగుతున్న కియా మోటార్స్ సంస్థ (కార్ల తయారీ కంపెనీ) తమిళనాడుకు తరలిపోతుందని పేర్కొంటూ కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు రాశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అలాంటి తప్పుడు ప్రచారాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కియా పరిశ్రమను ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో కంపెనీ ప్రతినిధులు సీఎంతో పాటు తన తోనూ మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు.
పరిశ్రమ అద్భుతంగా పనిచేస్తూ కియా కార్లను ఉత్పత్తి చేస్తోందని, మార్కెట్లో కియా కార్లకు గుర్తింపు వచ్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రూ. 14 వేల కోట్ల పెట్టుబడితో కియా ప్లాంటు ఏర్పాటు చేశారని, పరిశ్రమల శాఖ నుంచి కియాకు పూర్తి సహకారం అందించామని మంత్రి చెప్పారు. కియా పరిశ్రమ నిర్వాహకులు చాలా సంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
తాము పని మాత్రమే చేస్తామని, గత ప్రభుత్వం మాదిరి ప్రచారాన్ని ఆశించకపోవడం వల్లే తప్పుడు ప్రచారాలు తమపై చేస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా వార్తా కథనాలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులపై ఐఈఎమ్ డాక్యుమెంట్ ప్రకారం 2019 అక్టోబర్ వరకు రూ.15953 కోట్లు పెట్టుబడులు పెడతామంటే రూ.32 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు.
ఈ ఒక్క సంవత్సరంలోనే ఇది. 2018లో రూ.19800 కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకొస్తే రూ.9500 కోట్లు మాత్రమే వచ్చాయి. 2017లో రూ. 4500 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది ఐఈఎమ్ డాక్యుమెంట్. బేసిక్ డేటా ఇది. అంతకుముందు నాలుగేళ్ళు ఎలా ఉన్నాయో చూశారు కదా… తాము పనిచేసుకుంటూ పోతున్నాం తప్ప అడ్వర్టైజ్ మెంట్ చేయడం లేదని మంత్రి వెల్లడించారు.
తమ ప్రభుత్వం 1252 కంపెనీలకు ఏపిఐఐసీ 1057 ఎకరాలు భూకేటాయింపులు చేసిందని చెప్పారు. ఇది కాకుండా ముఖ్యమైన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని వివరించారు. బిర్లా గ్రూప్కు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్. స్మార్ట్ కెమ్ టెక్నాలజీస్, ఏటీసీ టైర్స్, సీఆర్ఆర్ కార్పోరేషన్ ఫర్ మెట్రో కోచెస్, హ్యుండయ్ స్టీల్స్, పాస్కో స్టీల్స్ ఇవన్నీ ముందుకొచ్చాయి, చర్చలు జరుగుతున్నాయన్నారు.
అదే విధంగా జూన్ నుంచి నవంబర్ 2019 వరకు 19 యూనిట్లు గ్రౌండ్ అయితే రూ.15,600 కోట్లు పెట్టుబడి గ్రౌండ్ అయిందని వివరించారు. అదే విధంగా 8 యూనిట్లు రూ.7900 కోట్లతో ట్రయల్రన్కు రెడీగా ఉన్నాయని తెలిపారు. మరో 8 యూనిట్లు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇదీ తమ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధని…తాము ప్రచారానికి దూరంగా లోప్రోఫైల్గా చేయాల్సిన పనిచేస్తున్నామని వెల్లడించారు. గత ఐదేళ్లలో పరిశ్రమలకు ఇన్సెంటివ్ విషయంలో రూ.3,500 కోట్ల మేర రాయితీలను చెల్లించలేదని.. దాన్ని బట్టే పరిశ్రమల ప్రోత్సాహకంపై గత ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని మంత్రి వివరించారు.