రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా ఓటర్లను నమోదు చేయించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులు త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఓటర్లను నమోదు చేయించాలని కోరారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను, ఉద్యోగులను, మోసగించి ఉందని, రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. రానున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం గెలుపు తధ్యమని అన్నారు.
తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇంచార్జ్ దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మేధావులు విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి నియంతృత్వ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రొఫెసర్ కోదండరామ్ విజయమే మన ధ్యేయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా యువజన కార్యదర్శి బిక్షం, రైతు సంఘం అధ్యక్షుడు సీతారాంరెడ్డి, రవికుమార్, బాలస్వామి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.