నిత్యావసరాలకు ప్రజలు బయటకు వచ్చిన సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సంత బజారులో యథావిధిగా సంత నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాధి పై అవగాహన లేకుండా ఒకరికి, ఒకరికి డిస్టెన్స్ లేకుండా జనాలు గుమిగూడారు.
దీనితో సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు. ఓ వైపు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మరోవైపు ఎస్ఐ మురళి గౌడ్ సిబ్బందితో అదుపు చేశారు.
అయినా ప్రజలు మారక పోవడంతో లాఠీ పట్టుకోవడంతో సంతను ఎత్తేశారు. అది అలా ఉంటే మటన్ షాపుల ముందు చదువుకున్న జ్ఞానవంతులు, మటన్ ప్రియులు ఇష్టానుసారంగా ఒకరికి ఒకరు తగులుతూ మటన్ విక్రయాలు చేయడంతో అధికారులు హెచ్చరించారు.
మున్సిపల్ చైర్మన్ భర్త, టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర చారి మైకులో హెచ్చరికలు జారీ చేశారు. సిఐ బి.వెంకట్ రెడ్డి రంగంలోకి దిగడంతో పూర్తిగా దారికి వచ్చారు. రోడ్లపై జనాల రద్దీ తగ్గింది.
ఈ సందర్భంగా బి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అనవసరంగా ప్రజలు రోడ్లపైకి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. లాక్ డౌన్ ప్రతీ ఒక్కరు పాటించాలన్నారు.