మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేశారు. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఏక్నాథ్ శిందే తో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు.
బిజెపి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన రెబల్ నేత ఏక్నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడ్డట్టు అయింది. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సమక్షంలో సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేశారు.
శిందేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఫడణవీస్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడణవీస్ ప్రకటించగా బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఫడణవీస్ డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.