కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు కటికనేని మధుసూదన్ రావు మరణించారు. 1994 లో టీడీపీ అభ్యర్థిగా కొల్లాపూర్ లో పోటీచేసిన మధుసూదన్ రావు ఇంతవరకు కొల్లాపూర్ చరిత్రలోనే ఎవరు సాధించలేని విధంగా దాదాపు 34 వేల ఓట్ల మెజారిటీతో రికార్డ్ సృష్టించారు.
కటికనేని మధుసూదన్ రావు అకాల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తపరిచారు. విషయం తెలిసిన వెంటనే అపోలో ఆసుపత్రికి చేరుకున్న జూపల్లి వారి భార్య బిడ్డలను ఓదార్చుతూ కనీటిపర్వాంతం అయ్యారు.
కొల్లాపూర్ నియోజక వర్గంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి నూతన తరానికి అందించిన వ్యక్తి మధుసూదన్ రావు అని జూపల్లి అన్నారు. అభివృద్ధి కోసం తన హయాంలో నిరంతరం కృషి చేసిన గొప్ప రాజకీయవేత్త అకాల మృతి చెందడం ఆ కుటుంబానికే కాక కొల్లాపూర్ నియోజక వర్గానికి తీరని లోటని యన అన్నారు.
ఒక సమీప బంధువు గా రాజకీయవేత్తగా తనకు ఎంతో సన్నిహితంగా మెలిగిన నాయకుడు మధుసూదన్ రావును ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి కుంటుంబానికి భగవంతుడు మనో ధైర్యం కలిగించాలని వారికి మన శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాని తెలిపారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు మృతి ఎంతో బాధాకరం అని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు మృతి పట్ల ఎమ్మెల్యే భీరం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జీవితాంతం ప్రజల కోసం పని చేసిన మంచి నాయకుడిగా కటికనేని మధుసూదన్ రావు నిలిచిపోతారని, ఆయన మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని అన్నారు.