రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సమక్షంలోనే ఒక బిజెపి నాయకుడికి ముస్లింలు పూర్తి మద్దతు తెలిపితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలియదు కానీ… కొల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి సమక్షంలో ఈ సంఘటన జరగడం పలువురిని ఆశ్చర్య పరిచింది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని ఖాదర్ పాషా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు జామే మజీద్ ఉర్సు ఉత్సవ కమిటీ ఆహ్వాన మేరకు హాజరయ్యారు.
ఆయనకు మైనారిటీల మత ఆచారం ప్రకారం ఘన స్వాగతం పలికారు యువకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇదే వేదికపై టీఎర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రతి ఏటా ప్రజలందరూ కులమతాలకతీతంగా నిర్వహించుకునే ఉర్సు ఉత్సవం ఖాదర్ పాషా దర్గాలో జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పటికే కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధికి పలు ప్రాజెక్టులను కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు తీసుకువచ్చారు. సోమశీల సిద్దేశ్వర వంతెన సాధనలో ఆయన పాత్ర మరువలేనిది. ఈ జాతీయ రహదారి దర్గా ప్రక్కన నుంచే వెళ్లడం వల్ల దర్గా అభివృద్ధి చెందుతుందని ఆయన ఈ సమావేశం సందర్భంగా స్పష్టంచేశారు.
ఇప్పటికే జాతీయ మైనారిటీ కౌన్సిల్ మెంబెర్ అయిన హనీఫ్ అలీ తో భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి MD ఇమ్రాన్ ఖాన్ ను ఎల్లేని సమావేశ పరిచారు. ఆయన దర్గా గురించి ఆమెకు వివరించిన సంగతి తెలిసిందే. దానికి హనీఫ్ అలీ సానుకూలంగా స్పందించిన సంగతి కూడా తెలిసిందే.
పర్యవసానంగా నాలుగు కోట్ల రూపాయల జాతీయ నిధులతో ఖాదర్ పాషా దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ వారం, పది రోజుల్లో కేంద్ర మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు ఖాదర్ పాషా దర్గాను పరిశీలించడానికి రానున్నట్లు తెలిపారు.
ఎల్లేని సుధాకరరావు ప్రకటనకు ముస్లిం ప్రజలు చప్పట్లతో సంతోషాన్ని తెలియజేశారు. ఎల్లేని కొల్లాపూర్ ముస్లింలకు హామీ ఇస్తున్న సమయంలో ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు, శ్రద్ధగా వింటున్నట్లు కనిపించారు. కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రావు అయితే చేతులు కట్టుకొని మరి నిలబడి శ్రద్ధగా విన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్