రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆర్థిక లోటు పేరు తో ప్రభుత్వ ఉద్యోగుల పొట్టమీద కొట్టడం కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నందువల్ల రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాజకీయ విమర్శలు చేయలేదు కానీ నేటి పరిస్థితుల కారణంగా శ్వేతపత్రం డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కరోనా కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడతానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తున్నారో చెప్పాలని ఆయన కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలిసిన ఐ ఆర్,పి ఆర్ సి ఇవ్వకుండా వేతనాలను 50 శాతం కోత విధించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇలా తయారు అయిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల వేతనాలు 50 శాతం, 4th క్లాస్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం కట్ చేస్తున్నారు కాదా మరి ఇలాంటి ఆర్ధిక పరిస్థితి ఉన్నపుడు కొత్త సచివాలయం నిర్మాణం చేస్తామని ఎలా చెప్పుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్స్ లో కూడా 50 శాతం కోత విధించడం ఏమిటి అని ఆయన అన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగైదు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయాలి లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను రూపొందిస్తుందని ఆయన తెలిపారు.