32.2 C
Hyderabad
May 2, 2024 01: 58 AM
ఆధ్యాత్మికం

ఉట్టి కొట్టగలవా? నరహరి నన్ను మించగలవా?

#Krishnastami One

శ్రీ కృష్ణాష్టమి ఒక పవిత్రమైన రోజు. సృష్టికి మూలం అయిన శ్రీ మహావిష్ణువు లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజును కృష్ణాష్టమిగా పిలుచుకుంటాం. కొన్ని ప్రాంతాలలో గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల పల్లె పడుచులు అయితే దీన్ని ఉట్ల పండుగ అంటారు.

గ్రామాలలోని యువతకు ఇది ఒక సరదా రోజు. ఉట్టి కట్టడం, దాన్ని కొట్టడం ఒక సరదా. ఒకడు ఉట్టి కొడుతుంటే అతడు సఫలీకృతుడు కాకుండా చూసేందుకు మిగిలిన యువకులు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. శృతి మించని సరదాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.

శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా చెప్పారు.

పైకొని చూడరె వుట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నేడితడు

నడురేయి జనియించినాడు చూడ గదరే

అరుదై శ్రావణబహుళాష్టమి నాటి రాత్రి

తిరువవతారమందెను కృష్ణుడు

యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు

కరములందు బెట్టితే కడుసంతోసించెను

ఇలాంటి కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు వేయాలి.

పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పాలు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. ముందుగా దీపారాధన చేయాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కున తిరిగి, “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి. ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, గౌడీయ మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. మరి అందరికీ సత్యం న్యూస్ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

గుమ్మడి శ్రీనివాస్

Related posts

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీపంచమి వేడుకలు

Satyam NEWS

రాష్ట్రంలో కార్తీక శోభ

Sub Editor

చక్రస్నానం,ధ్వజారోహణం తో ముగిసిన  శ్రీ  సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment