ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంత్రి కేటీఆర్ ఓటర్ లిస్టులో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో ఇందుకు సంబంధించిన పత్రాలను స్థానిక మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం మరింతగా ఉందని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
ఉన్నత విద్యావంతులైన గ్రాడ్యుయేట్లు అంతా తమ పేరుని ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకోవాలని ఎన్నికల్లో మొత్తం ఓటర్ లిస్ట్ తాజా ఓటర్ల నమోదు ఆధారంగానే ఉంటుందని తెలిపారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
2017 నవంబర్ నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఓటర్ లిస్టు లో తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులేనని అన్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు.