పేదవాళ్లంతా కలిసి జగన్ చేతికి పవర్ ఇస్తే ఆయన మాత్రం గెలిచిన తర్వాత పేదవారి ఇళ్లలో పవర్ లేకుండా చేసేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా వినికొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం శానంపూడి గ్రామ దళిత వాడ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడి దళితవాడలోని ఒక పేద దళితుడి ఇంటికి 70 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని ఆయన తెలిపారు.
ఆ బిల్లును మీడియాకు చూపించారు. అక్కా బిల్లెంత ? అవ్వా బిల్లెంత ? అమ్మా బిల్లెంత ? అని అడిగే దమ్ము ఇప్పుడుందా జగన్ రెడ్డి ? అని ఆయన ప్రశ్నించారు. జగన్ బాదుడు కి జనాల వీపులు వాచిపోతున్నాయని ఆయన అన్నారు.
6 సార్లు విద్యుత్ ధరలు పెంచి సుమారుగా 12 వేల కోట్లు భారాన్ని ప్రజల పై మోపిన ఘనత జగన్ దేనని ఆంజనేయులు అన్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలు AC ల వాడకం తగ్గించాలని ప్రభుత్వం అంటోంది అంటేనే అర్ధమవుతుంది అతి త్వరలో రాష్ట్రం అంధకారం కాబోతోంది. జగన్ చేతగాని పాలన వలన ఆంధ్రప్రదేశ్ అంధకారాంధ్రప్రదేశ్ గా మారబోతుంది అని ఆయన విమర్శించారు.
కరెంటు బిల్లు పెరిగింది అని పెన్షన్ పీకేయడాన్ని ఏమంటాం? బిల్లు పెంచింది ఎవరు? జగన్ రెడ్డి అని ఆయన అన్నారు. నువ్వే కరెంటు బిల్లు పెంచి నువ్వే పెన్షన్ పీకేస్తే మరి చెత్త పాలన అనకపోతే ఏమనాలి అని ఆయన ప్రశ్నించారు. ఫ్యాన్ కి ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేకుండా చేసాడని ఆయన అన్నారు.