గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సిఫార్సుల మేరకు కర్రి పద్మ శ్రీ , డా.కుంభా రవిబాబు లను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకం చేశారు. గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చడిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ల పదవీ కాలం జూలై 20 వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఖాళీ స్థానాల్లో నూతనంగా వీరిరువురిని నియమిస్తూ ఉత్తర్వులను జారీచేయడం జరిగింది.
గవర్నర్ కోటాలో నూతనంగా నియామకం అయిన శాసన మండలి సభ్యులలో ముఖ్యమంత్రి జగన్ ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు. డా కుంభారవి బాబు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా కర్రి పద్మ శ్రీ వాడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. డాక్టర్ కుంభా రవిబాబు ఆంధ్రాయూనివర్సిటీలో 1989 నుంచి 2004 వరకు ప్రొఫెసర్గా పనిచేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో ప్రవేశించారు. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అసెంబ్లీలో ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం 2019లో పార్టీ అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్గా వ్యవహరించారు. ఎస్టీ సామాజిక వర్గానికి డా.కుంభా రవిబాబును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియామకం చేయడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యురాలిగా నియామకం అయిన కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాడ బలిజ నుంచి తొలి సారిగా మండలిలో అడుగు పెట్టనున్నారు. కర్రి పద్మశ్రీ జాతీయ మత్య్సకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పని చేసారు. ఆమె భర్త నారాయణ రావు వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.