హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బుధవారం లక్ష కుంకుమార్చన కన్నుల పండుగగా జరిగింది. ప్రాతః కాలార్చన భక్తుల గోత్రనామాలతో ప్రారంభించి,విష్ణు సహస్రనామార్చన, గోదాదేవి,రామానుజ వారి అష్టోత్తరాలు అర్చకులు శాస్త్రాక్తంగా నిర్వహించారు.తిరుప్పావై మహిళా భక్తులు శ్రావ్యంగా గానం చేశారు.
స్థానిక భక్తులు పూరే శ్రీనివాస్,వసంత దంపతుల ఇంటి వద్ద నుండి లక్ష కుంకుమను ఊరేగింపుగా మేళ,తాళాలతో,గీతాగోవిందం భజన మండలి వారి కీర్తనలతో దేవాలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. దేవాలయంలో గోదాదేవి మూలవరులకు పంచామృతాలతో, పంచసూక్తలతో అభిషేకించి పూలు,తులసి పూలమాలతో,పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
పదిమంది అర్చకులు అమ్మవారికి,స్వామివారికి సమర్పించగా పదిమంది ఋత్వికులు శ్రీ రంగనాయకి సహస్రనామావళిని పఠించారు.ఉభయ దేవేరులైన రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారిని,గోదాదేవిని,సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారిని మండపంలో భద్ర పీఠంపై అధిష్టింపజేసి లక్ష కుంకుమార్చన వీనుల విందుగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగవత భక్తమండలి మహిళలు గర్రె భారతమ్మ, వంకాయల పద్మ,పశ్య పిచ్చమ్మ,రమేష్, కామిశెట్టి నందయ్య,అర్చకులు స్థానా చార్యులు,దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్