విజయనగరం జిల్లా పోలీసు శాఖలో సమర్ధవంతంగా పని చేసి, అనారోగ్య కారణాలతో పోలీసు జాగిలం “రాకీ” మృతి చెందినట్లుగా జిల్లా ఎస్పీ .దీపిక తెలిపారు. పోలీసు డాగ్ “రాకీ” జర్మన్షెపర్డ్ జాతికి చెందినదని, హైదరాబాద్ ఇంటిలిజెన్సు సెక్యూరిటీ వింగ్ లో శిక్షణ పొందిందన్నారు.
శిక్షణానంతరం, 2015 లో విజయనగరం జిల్లాకు వచ్చి సుమారు ఏడేళ్ళ సమర్థవంతంగా పని చేసి పోలీసుశాఖకు విశేషమైన సేవలు అందించి అనారోగ్య కారణాలతో ఈ నెల 14న మృతి చెందిందన్నారు. ముఖ్యమైన మరియు అతి ముఖ్యమైన వ్యక్తులు జిల్లాకు విచ్చేసినపుడు పోలీసుశాఖ చేపట్టిన తనిఖీలలో ‘రాకీ’ ఎంతో చురుకుగా పాల్గొనేదన్నారు. ప్రేలుడు పదార్థాలను, భూమిలో దాచిన బాంబులను గుర్తించుటలో ‘రాకీ’ విశేషమైన గుర్తింపు పొందిందన్నారు.
రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ విశాఖపట్నం పర్యటనలో భద్రతా ఏర్పాటు చర్యలలో భాగంగా పోలీసు జాగిలం ‘రాకీ’ తనిఖీలు నిర్వహించుటలో అత్యంత కీలకంగా వ్యవహరించిందన్నారు. అంతేకాకుండా, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మందుపాతర్లు, ప్రేలుడు పదార్ధాలు తనిఖీలు నిర్వహణలో కీలక పాత్ర పోషిందన్నారు.
గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పోలీసులు చేసే విన్యాసాలలో ‘రాఖీ’ పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచేదన్నారు. మృతి చెందిన ‘రాకీ’ అంత్య క్రియలను అయ్యన్నపేట శ్మసానవాటికలో అధికార లాంఛనాలతో పోలీసు శాఖ నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.
ఈ జాగిలం హ్యాండ్లరుగా ఎఆర్ హెడ్ కానిస్టేబులు రమణ వ్యవహరించేవారన్నారు. పోలీసుశాఖ ‘రాకీ’ అంత్యక్రియలలో ఆర్ఐ చిరంజీవిరావు, పశు వైద్యాధికారి డా.వెంకట రమణ, డాగ్ హ్యాండలర్ హెడ్ కానిస్టేబుల్ చందక రమణ, హెడ్ కానిస్టేబుల్ ఉమా మహేశ్వర రావు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.