గ్రామీణ బి.టీ రోడ్ల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యత పాటించకుండా రోడ్ల నిర్మాణం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. దీని వల్ల రోడ్లు వేసిన కొద్ది రోజులకే పాడవుతున్నాయని ఆయన అన్నారు.
భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మండలంలోని ఇస్సీపేట నుండి మొగుల్లపల్లి వయా మేదర మట్ట, అంకుశపూర్ వరకు 7 కిలోమీటర్ల రోడ్ నిర్మాణానికి 5కోట్ల రూపాయల నిధులు గ్రామీణ రోడ్ల నిర్మాణ పధకంలో మంజూరు చేశారని ఆయన తెలిపారు. ఆ రోడ్ నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయడం తో మెదరమట్ట అంకుశపూర్ మధ్య దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్ చెడిపోయిందని సుధాకర్ గౌడ్ అన్నారు.
దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కాంట్రాక్టర్లతో లాలూచీ పడడం వల్ల రోడ్ వేసిన కొద్ది రోజులకే పాడై పోయిందని ఆయన అన్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి కాంట్రాక్టర్ నుండి నిధులు రికవరీ చేసి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సుధాకర్ గౌడ్ తెలిపారు.