అనేక సమస్యలతో సతమతమవుతున్న గిరిజనులకు అందరు అండగా ఉండాలి, వారిని సమాజంలో ఉన్నత స్థానంలోకి తీసుకురావాలి, ఇందుకు అందరి సహకారం అవసరం, వారి సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. భద్రాచలంకు అతిసమీపంలోనే వున్న5 గ్రామాలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపారని, ఆ గ్రామాలను తెలంగాణలో కలపాలని ముఖ్యమంత్రి కేసిఆర్ తో సహా, ఇక్కడి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఈ అంశాలను పరిష్కరించాలని భద్రాద్రికి వచ్చిన గవర్నర్ తమిలిసైకి వినతులు వచ్చాయి. దీంతో అంధ్రప్రదేశ్ లో విలీనమైన భద్రాచలం సమీపంలోని 5 గ్రామపంచాయతీలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ తో సహా గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని గవర్నర్ తమిలిసై హామీ ఇచ్చారు.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆమె ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆమె భద్రాచలంలో ఆదివాసీలతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలతో పాటు, 5 విలీన పంచాయతీల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకుపోతానని గవర్నర్ తమిలిసై అన్నారు. ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని చాలా బాధ పడుతున్నానని చెప్పారు. తాను తమిళ ఆడబిడ్డనైనా, తెలంగాణ ప్రజలకు అక్కనని, ఇక్కడి సమస్యలను అర్దం చేసుకున్నానని, వాటిని వీలైనంత త్వరగా
పరిష్కరించే దిశగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆదివాసీలు తమ సమస్యల పరిష్కార బాధ్యతలు తనకు అప్పగించారని, వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ ప్రాంత సమస్యలను వివరించారు. గవర్నర్ గిరిజనులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిoచే ప్రయత్నం చేశారు. గిరిజనులకు తాను అందగా వుంటానని ప్రకటించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.