27.7 C
Hyderabad
May 4, 2024 08: 24 AM
Slider ముఖ్యంశాలు

జగన్ పై యుద్ధం ప్రకటించిన నవశకం లోకేష్

#lokesh

జగన్ ఎమ్మెల్యేలను మార్చాలి అంటుంటే జనం జగన్ ని మార్చాలి అంటున్నారని యువగళం నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ అన్నారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. కొండంత అండ కోస్తాంధ్ర.    రత్నాలసీమ రాయలసీమ. అందరి విశాఖ‌…అందాల విశాఖ‌. అన్ని ప్రాంతాల నుండీ వచ్చిన ప్రజలు, ముఖ్య అతిధులుగా వచ్చిన టిడిపి అధ్యక్షులు చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీ అందరి బాలయ్య నా ఒక్కరికే ముద్దుల మామ‌య్య, టిడిపి – జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం అంటూ లోకేష్ తెలిపారు.

ఇది యువగళం ముగింపు సభ కాదు…ఇది ఆరంభం. ఇది నవశకం. యుద్ధం మొదలైంది. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదాం అని ఆయన తెలిపారు. యువగళం పాదయాత్ర నేను కుప్పంలో మొదలుపెట్టాను. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసాను. యువగళాన్ని ఆపేందుకు జగన్ జిఓ.1 తీసుకొచ్చాడు. నేను ఆ రోజే చెప్పా బ్రదర్ జగన్ జిఓ.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో తగ్గేదేలేదు అని. నా మైక్ వెహికల్ లాక్కున్నాడు. అన్న ఎన్టీఆర్ గారు ఇచ్చిన గొంతు ఇది. ఆపే మగాడు ఇంకా పుట్టలేదు. పోలీసుల్ని పంపాడు యువగళం ఆగలేదు.

వైసిపి గూండాలను పంపాడు మన పసుపు సైన్యాన్ని చూసి పారిపోయారు అని ఆయన తెలిపారు. ఒక పక్క యువగళం..మరో పక్క చంద్రబాబు గారి భవిష్యత్తుకి గ్యారెంటీ..పవనన్నవారాహి యాత్ర తో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం.      

అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. విజనరీ అంటే చంద్రబాబు… ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బతీసావ్ జగన్…ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్ అంటూ లోకేష్ హెచ్చరించారు. జగన్ ఈ మధ్య పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు.

లక్ష కోట్లు దోచిన వాడు, లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేష్ ప్రశ్నించారు. జగన్ హయాంలో ఏపీ అప్పు 12 లక్షల కోట్లకు చేరబోతోంది. ఏడాదికి మనం కట్టాల్సిన వడ్డీ ఎంతో తెలుసా లక్ష కోట్లు. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే భారం మొయ్యాల్సింది ప్రజలే. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి… ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలి అని లోకేష్ అన్నారు.

పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది..నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నాను. ఒక్క నాయకుడు చేసిన తప్పుల వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్లారా చూసాను. జగన్ విధ్వంసం ప్రతి అడుగులో చూసాను. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు.    

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలెక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి… పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది… జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి…జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ మునిరాజమ్మ జగన్ పాలనలో పడుతున్న బాధని నాతో చెప్పుకుంది. మీడియాతో మాట్లాడింది. పిల్ల సైకో బియ్యపు మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ టిఫిన్ బండిని ధ్వంసం చేసాడు. కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరితే వదిలేస్తాం అన్నారు అయినా ఆమె తగ్గలేదు. సైకో పాలన పై పోరాడింది ఆమెకు టిడిపి అండగా నిలబడింది. ఆమె ధైర్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను.

పలమనేరుకి చెందిన మిస్బా తల్లితండ్రులు నన్ను కలిసారు. వైసిపి నాయకుడు కూతురు స్కూల్ ఫస్ట్ రావాలి అని మిస్బాకి టీసీ ఇచ్చి  వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసారు. డాక్టర్ అవుతానని డైరీ లో రాసుకున్న మిస్బా ని చంపేసిన పాపం ఈ సైకోలను ఊరికే వదలదు. ఇలాంటి బాధ ఏ కుటుంబానికి రాకూడదని కోరుకున్నాను. ఎమ్మిగనూరులో రైతులతో సమావేశమైనప్పుడు రంగమ్మ అనే మహిళా రైతు తన భర్త 12 ఎకరాలు కౌలుకి తీసుకోని అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు అని కన్నీరు పెట్టుకుంది.

ఆ మహిళా రైతు కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే ఆమెకు పార్టీ తరపున సాయం అందించాను. మంత్రాలయం నియోజకవర్గం వలస కూలీలను కలిసాను. వ్యవసాయ పనులు లేక పిల్లలతో సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వస్తన్న వారితో మాట్లాడాను. వ్యాన్ లో వాళ్ళను చూసిన తరువాత నాకు బాధ కలిగింది. ఆలూరు నియోజకవర్గంలో నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్లు నడవడం చూసాను.

ప్యాలస్ లో పడుకునే జగన్  కి మహిళలు పడుతున్న కష్టం కనపడటం లేదు. జి.డి నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకొని జీవిస్తున్న మోహన అనే మహిళను కలిసాను. ఆమె భర్త చనిపోయాడు. కష్టపడి ఇద్దరు పిల్లల్ని చదివించారు. పెద్దబ్బాయి ఎంసిఎ, చిన్నబ్బాయి డిప్లొమా చేసారు. ఆమె ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సాయం వద్దు.

పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూడండి చాలు అని అన్నారు. ఆ మాటలు విన్న తరువాత ఎంత బాధ్యతగా పనిచెయ్యాలో అర్థమైంది. పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పద్మావతి అనే యువతి వచ్చి నన్ను కలిసింది. ఆమె కియా అనుబంధ సంస్థలో పనిచేస్తుంది. అంతకు ముందు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఇప్పుడు కియా అనుబంధ సంస్థలో పనిచేస్తూ నెలకు రూ.30 వేల జీతం సంపాదిస్తుంది.

ఆమె కళ్ళలో ఆనందం చూసిన తరువాత నాకు చాలా సంతోషం వచ్చింది. రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు టిడిపి నాయకుడు తగరకుంట ప్రభాకర్ గారి పిల్లలు నన్ను కలిసారు. 2004 లో వైఎస్ గారు సీఎం అయిన తరువాత తగరకుంట ప్రభాకర్ గారిని దారుణంగా హత్య చేసారు. వారి పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో చదువుకున్నారు.

అందరికి ఉద్యోగాలు వచ్చాయి.ప్రభాకర్ గారి చిన్న అమ్మాయి శ్రావ‌ణి వచ్చి అన్ని విషయాలు చెప్పి తనకి కూడా బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది అన్నా అన్నప్పుడు చంద్రన్న లో మానవత్వం గుర్తొచ్చింది. ప్రకాశం జిల్లా ని ఎడారిగా మార్చాడు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తిచెయ్యలేదు. గుంటూరు, కృష్ణా  నాలుగున్నర ఏళ్లుగా అమరావతి రైతులు, మిర్చి, పత్తి రైతులు  పడుతున్న కష్టాలు నేరుగా చూసాను. రాజధానిని చంపేసి జగన్ పడుతున్న రాక్షస ఆనందం చూసాను.

ఉభయగోదావరి జిల్లాల్లో జగన్ ఆక్వా రంగాన్ని ఎలా దెబ్బతీశాడో చూసాను. కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతుల బాధలు తెలుసుకున్నాను.  గుంతల్లో రోడ్డు ఎక్కడ ఉందా అని వెతుకున్నాను. రాయలసీమ జిల్లాల ప్రజలు పడుతున్న కష్టాలు చూసిన తరువాత మిషన్ రాయలసీమ ప్రకటించాను. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, హార్టీ కల్చర్ హబ్ గా త‌యారు చేస్తాం, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారుస్తాం. ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా మారుస్తాం. నెల్లూరు లో ఆక్వా రైతుల కష్టాలు చూసాను. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూ.1. 50కే యూనిట్ విద్యుత్ అందిస్తాం. ప్రజా రాజధాని అమరావతి పూర్తి చేస్తాం. మిర్చి,పత్తి రైతులను ఆదుకుంటాం.

ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఇస్తాం. మేజర్ రోడ్లు అన్ని సిసి రోడ్లు వేస్తాం. మూడుముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఒక్క ఇటుక వెయ్యలేదు జగన్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు కొట్టేయడానికి జగన్ స్కెచ్ వేసాడు. అందుకే 31 మంది ఎంపీలు ఉన్నా ప్రైవేటీకరణ ఆపడానికి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని అడగడు, ఏపీలో ఉన్న మైన్స్ ని రెన్యూవల్ చెయ్యడు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెంచేస్తాడు. దసపల్లా భూములు, సిఎన్బిసి భూములు, హయగ్రీవ భూములు,ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసారు. లూలూ ని తరిమేసారు..ఆ భూములు కొట్టేసారు. టిడిఆర్ బాండ్స్ కుంభకోణంలో వేల కోట్లు వైసిపి నాయకులు కొట్టేసారు. రుషికొండ కు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నాడు. ఏ2 విజయసాయి రెడ్డి విశాఖను నాశనం చేసాడు.

ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విశాఖ మన్యంలో లేటరైట్‌, బాక్సైట్‌ ను దోచుకుంటున్నాడు. జివిఎంసి అవినీతికి అడ్డాగా మారిపోయింది. చెత్త ట్యాక్స్ తప్ప ఒక్క రోడ్డు వెయ్యరు, ఒక్క డ్రైనేజ్ కట్టరు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను జగన్ చంపేసాడు. రాయితీలు ఇవ్వకపోవడంతో విజయనగరం జిల్లాలో ఉన్న 31 పైగా ఫెర్రో అల్లా యిస్ పరిశ్రమలు మూతపడ్డాయి అని లోకేష్ తెలిపారు. 3132వేల కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.

మహాశక్తి పథకం కింద…

1)ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు.

2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు బిడ్డ‌లు ఉంటే రూ.30 వేలు.

3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం

4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్రయాణం. 

జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్  పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం అని లోకేష్ తెలిపారు. టిడిపి – జనసేన  అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం అని ఆయన తెలిపారు.

Related posts

నందమూరి సుహాసిని జన్మదిన వేడుకలు

Satyam NEWS

ఐడిఎల్ చెరువు వద్ద పెద్దల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

జగన్ ను నమ్ముకుంటే పదవులకు కొదవ లేదు

Satyam NEWS

Leave a Comment