సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్ర ప్రధాన రహదారి నుండి కోదాడకు ప్రతి రోజు కొన్ని వందల వాహనాలు వెళతాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న సిమెంట్ పరిశ్రమలకు వందల సంఖ్యలో రవాణా లారీలు సైతం ఈ రోడ్డుమీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి.
ఇంత రద్దీగా ఉంటున్న ఈ రోడ్లు పూర్తిగా పాడైపోయినా, చిన్న వర్షానికే చెరువులను తలపిస్తున్నా ప్రభుత్వ అధికారులు ఈ రహదారిని రిపేరు చేయక పోవడం శోచనీయం. ఈ రహదారి గుండానే రోజు వారీ విధుల నిర్వహణకు వెళ్లే అధికారులు కూడా ఈ రహదారి గురించి పట్టించుకోవడం లేదు.
అప్పుడప్పుడు మాత్రం తూ తూ మంత్రంగా మట్టి వేస్తున్నారు. దానివల్ల దుమ్ము ధూళి ఎక్కువై రోడ్డు వెంట పాదాచారులు నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా ఉంది. వర్షం నీరు నిల్వ ఉండటం భారీ వాహనాలు ప్రయాణం చేసే టైం లో ద్విచక్ర వాహనదారులు పాదచారుల పైన బురద చిందటం సర్వసాధారణంగా మారింది.
ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ ప్రధాన రహదారి మరమ్మతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుకుంటున్నారు.