ఇరు రాష్ట్రాల సీఎంలు పోతిరెడ్డిపాడు అంశంలో మాట్లాడుకుని చేస్తున్నారా అనే అనుమానం ఉందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 3టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తామని జివో విడుదల చేయడంపై అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే-ఏపీ ప్రభుత్వం పెంచుతూ వెళ్తోందని దీనికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సామర్ధ్యం తగ్గించిన నెలరోజులకు ఏపీ పెంచినట్లు జివో విడుదల చేసింది. ఆనాడు పోతిరెడ్డిపాడు కోసం రక్తం మరిగిపోతుందన్న కేసీఆర్ ఇవ్వాళ సీఎం గా ఉన్నారు మరి ఇంకా బాగా మరిగిపోవాలి కదా అని ఆయన ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాకు నీళ్ల కోసం శబరినది ఇందిరా సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 శాతం పూర్తి అయిందని, కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఉండడమే కాకుండా శబరినదిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోయారని యన అన్నారు. కేసీఆర్ తన ఆర్థికపరమైన లావాదేవీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని భట్టి ఆరోపించారు.
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి పై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేసీఆర్-జగన్ అన్నదమ్ములుగా ఉంటే ఉండనీయండి కానీ ఇది వారి ఇంటి వ్యవహారం కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. జగన్-కేసీఆర్ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నారని సీఎం కేసీఆర్ కి తెలియకుండానే ఏపీ జీవో ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు.