వృద్ధులు, వికలాంగులకు చెల్లించాల్సిన పింఛను సొమ్ముతో పారిపోయాడు ఓ వాలంటీర్. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండపల్లిలో చోటు చేసుకుంది. కొండపల్లి గ్రామానికి చెందిన హనుమంతు నాయక్ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం తరఫున వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించే సొమ్ము, ఇతర పథకాలను అందించేందుకు సంధానకర్తగా ఉండేవాడు.
గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛను అందజేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో జూలై నెలకు సంబంధించి 49 మందికి పింఛను అందించాల్సి ఉంది. ఆ డబ్బులను గ్రామ సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ హీరా నుంచి రూ.63,500 డబ్బులను తీసుకున్నాడు. జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా ఎంతకూ అతడు రాలేదు.
దీంతో లబ్ధిదారులే గ్రామ సచివాలయానికి వెళ్లి పింఛను డబ్బుల గురించి అడిగారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అతడు డబ్బులు తీసుకుని పరారైనట్టు నిర్ధారించారు. ఈ విషయంపై హనుమంతు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.