మహిళా టీచర్ ను వేధింపులకు గురిచేసిన వ్యక్తి ఆట కట్టించారు ప్రకాశం జిల్లా దిశ పోలీసులు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే ఒంగోలు లోని ఓ ప్రవేట్ బాయ్స్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న మహిళను గత కొన్ని రోజులుగా చంద్ర శేఖర్ అనే వ్యక్తి వెంటపడి
వేధిస్తున్నాడు. గతంలో మహిళా టీచర్ తో కలిసి చంద్రశేఖర్ పని చేసిన సమయంలో తీసుకున్న ఫోటోలను, కాల్ రికార్డ్ లను చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అధ్యాపకురాలు తన భర్త కు చెప్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ ఆగడాలు ఆగలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న టీచర్ ను చంద్రశేఖర్ వెంటపడి వేధించాడు.
అతని వికృత చేష్టలకు విసుగెత్తిపోయిన బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. మహిళా టీచర్ ఉంటున్న లొకేషన్ కు దిశ పోలీసులు కేవలం ఆరు నిముషాల వ్యవధిలో చేరుకున్నారు. మహిళ వెంటపడి వేధిస్తున్న చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రశేఖర్ ఫోన్ లో ఉన్న మార్ఫింగ్ ఫోటోలను, అసభ్యకరమైన సందేశాలను పోలీసులు సేకరించారు.
దీంతో బాధిత మహిళా టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్ పై ఐపీసీ 354 D, 506, 509 సెక్షన్ల కింద ఒంగోలు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపదలో ఉన్న తనను రక్షించడంతో పాటు, ఆకతాయి ఆట కట్టించిన పోలీసులకు మహిళా టీచర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.