ఎక్కడో చైనా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయని అప్పటిలో అనుకున్నాం. ఇప్పుడు ఇండియాలో లక్షల కరోనా కేసులు నమోదు అవుతుంటే నోరు వెళ్లబెడుతున్నాం. చైనాతో యుద్ధం చేయాలా వద్దా అనే సంశయంలో ఇప్పుడు దేశ ప్రజలందరూ తలమునకలై ఉన్నారు. ఒక వైపు కరోనా మహమ్మారి కేసులు విజృంభిస్తుంటే దానిపైన కాకుండా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ పై పోరాటం చేస్తున్నాం.
కరోనాకు భయపడాలా? కరెంటు బిల్లుకు భయపడాలా?
భారీగా విద్యుత్ బిల్లు నడ్డి విరుస్తుంటే కరోనాతో భయపడాలో కరెంటు గురించి బాధపడాలో అర్ధం కావడం లేదు. మరో పక్క నిత్యవసరాల రేట్లు పెంచి చివరికి సామాన్య ప్రజల జీవితాలతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. ఒక్కరు లక్షల కోట్లు విడుదల చేశామంటారు. మరొకరు మనది ధనిక రాష్టం అంటారు. ధనిక రాష్టం అయితే అప్పుల రాష్టం ఎందుకు అవుతుంది. ఎందుకు చేస్తున్నారు.
ఎవరికి వారు డబ్బాలు కొట్టుకుంటూ కాలాన్ని, అధికారాన్ని అనుభవించేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడో జరిగిన సంఘటనలపై తెగ పరుగులు, ఉరుకులు పెట్టింది. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది. మాట్లాడితే చైనా సరిహద్దు గొడవ ముందుకు తీసుకొస్తుంది. కరోనా అంశాన్ని మరిపిస్తుంది. చైనాతో యుద్ధం వస్తే అమెరికా మద్దతు వస్తుంది, ఇస్తుంది అని అమెరికాను తెగ పొగిడేస్తున్నారు.
చైనాపై యుద్ధం ముఖ్యమా కరోనాపై పోరాటం ముఖ్యమా?
చైనా తో యుద్ధం చేయడం ఎంత ముఖ్యమో, ప్రజల రక్షణ కూడా అంతే ముఖ్యం. మీరే అన్నారు. కరోనా అంటే మూడో ప్రపంచ యుద్ధం అని. యుద్ధం అయిపోయిందా. లేదు అసలైన యుద్ధాన్ని ఇప్పుడు ఎదుర్కోవాలి. అమెరికా భారత్ కు సాయం చేయడం మంచి పరిణామమే. కానీ లక్షల మందికి కరోనా వ్యాపిస్తుంటే ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేశారు.
కనీసం ఇంతవరకు ఒక్క మాట మాట్లాడక పోవడం ఏమిటి. ప్రజలు కావాలని కరోనా తెచ్చుకుంటారా? ఎవరికి కరోనా ఉందో వారికే తెలియదు. అలాంటప్పుడు ఎవ్వరు దీనికి బాధ్యత. ముమ్మాటికీ మీరే. ఎక్కడో ఉన్న కరోనా ను ఇండియాకు తెప్పించింది మీరు కాదా? ఇప్పుడు మందు దొరికిందని ప్రయివేట్ కంపెనిలు చెపుతుంటే మీరు అధికారికంగా ఎందుకు చెప్పడం లేదు.
అమెరికాను మొయ్యడమే ప్రధానమా?
రాష్ట ప్రభుత్వాలకు వదిలేసి మట్టసంగా వున్నారు. కనీసం రాష్ట ప్రభుత్వం కూడా మందులు వాడొచ్చని చెప్పడం లేదు. ఇక పోతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే అమెరికా అధ్యక్షుడిని కొద్దిగా హైలెట్ చేస్తున్నట్లు కన్పిస్తుంది.
ఇప్పుడు అమెరికా ఇంకా ఆరు నెలల వరకు ఎవ్వరిని దేశంలోకి రావడానికి వీలు లేదని చెప్పేసింది. ఇండియాకు చెందిన 5లక్షలకు పైగా ఉద్యోగులు ఇబ్బందులు, నిరాశకు కలిగిస్తుంది. మొత్తం మీద కరోనా నుండి అమెరికా జాగ్రత తీసుకుంటుంది. మరి కేంద్రం ఏమి చేస్తుంది?
ఒక్కటి గమనించాలి
ఎన్నికలు, ఇతర ఏమి జరిగిన దేశం సెంటిమెంట్ ను ముందుకు తీసుకోస్తుంది. అప్పుడు పాకిస్థాన్,ఇప్పుడు చైనా వారితో ఎందుకు ఫైట్ చేస్తున్నట్లు. దేశ ప్రజలకోసమే కదా! ఆ ప్రజలే యుద్ధంలో కాకుండా కరోనా మహమ్మారికి బలి అవుతున్నారు. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఇప్పటికైనా దారి మళ్లించండి. ప్రజల కోసం ఆలోచించండి.
కేంద్ర మంత్రులు కామ్ గా అయ్యారు. మీరు మాట్లాడాలి. ఇక తెలంగాణ రాష్ట ప్రభుత్వం విషయానికి వస్తే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మార్చే కార్యక్రమంలో పడినట్లు ఉంది. ఇన్ డైరెక్టుగా. ఇది ఇలా ఉంటే. ధనిక రాష్టం ఎలా అయింది, అవుతుంది. లాక్ డౌన్ ఎత్తివేసినాక (ఆంక్షలతో) లిక్కర్ పై రేట్లు పెంచారు.
ధనిక రాష్ట్రంలో ధరల మోత
బస్ టికెట్ చార్జీలు పెంచారు. ప్రతి వస్తువుపై రేట్లు పెరిగాయి. ఇది బాగా ఉన్నవారికి చివరిలో తెలిసిన సామాన్యులకు ఇప్పుడు దిమ్మతిరుగుతుంది. కరోనా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. లాక్ డౌన్ సమయంలో ఇంటి ఇంటి సర్వే, పరీక్షలు చేయించి ఉంటే కరోనా కట్టడి అవుతుండే. అవి ఏవి చెయ్యకుండా ప్రెస్ మీట్లతో జర్నలిస్టులను తిట్టడం తప్ప ఏమీ చెయ్యలేదు.
ఇప్పుడు కరోనా తాండవం చేస్తుంది
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనా రాష్ట్రంగా మారిపోయింది. కరోనా పోరులో పోరాటం చేసిన వారు ఇప్పుడు బలి అవుతున్నారు. ఏదో మందు వచ్చిందని మీడియాలో ప్రచారం బాగా అవుతుంది. మరి దీనిపైన అధికారికంగా సీఎం ఎందుకు మాట్లాడడం లేదు.
ఏది ఏమైనా ఇప్పటికైనా కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ సమయంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఉచిత బియ్యం,డబ్బులు ప్రజలకు పంపిణీ చేశామని చెప్పుకున్నాయి. మరిన్ని పకడ్బంది నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మందు షాపులు తప్ప మనుషులు మిగలరు.
అవుట రాజశేఖర్ జర్నలిస్ట్ కొల్లాపూర్