ఓటర్లను ప్రభావితం చేయగలిగిన కమ్మ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు బీఆర్ యస్ పార్టీకి దూరం అవుతున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల బీఆర్ యస్ కు బై బై చెప్పిన రెండు మూడు రోజుల్లోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అదే సామాజికవర్గానికి చెందిన మండవ వెంకటేశ్వరరావు బీఆర్ యస్ కు గుడ్ బై చెపుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి నుంచి నాలుగు సార్లు, నిజామాబాద్ రూరల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండవ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చాలాకాలం పనిచేశారు. పాలేరు టికెట్ ఇవ్వకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ యస్ కు దూరం కాగా, చాలా రోజులుగా బీఆర్ యస్ లో ఉన్నా ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో మండవ వెంకటేశ్వరరావు కినుక వహించి ఉన్నారు. రాజ్యసభ సీట్లు ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా కేసీఆర్ సీనియర్ నేతలను పట్టించుకోలేదనే విమర్శ ఉంది.
తెలంగాణ లో కమ్మ సామాజికవర్గం సంఖ్య పరంగా తక్కువే అయినప్పటికీ 25 నుంచి 30 సీట్లలో ప్రభావం చూపగలుగుతుంది. మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం నుంచి బీఆర్ యస్ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేలుగా అరికపూడి గాంధీ, కోనేరు కోనప్ప, నల్లమోతు భాస్కర్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ తాతా మధు ఉన్నారు. వ్యవసాయ రంగంలోనే కాకుండా వ్యాపార రంగంలో వీరి పునాదులు బలంగానే ఉన్నాయి. చిత్ర పరిశ్రమ, రియల్ ఎస్టేట్, ఫార్మారంగంలో కమ్మ కులస్తులు కీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరి కేసీఆర్ కు అండదండలుగా ఉన్న ఈ సామాజికవర్గంలో బలమైన బలుకుబడి ఉన్న కీలక నేతలు బీఆర్ యస్ కు దూరం కావడం ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.