మహిళల హక్కుల కోసం పోరాడుతున్నామని నీతులు చెప్పే మావోయిస్ట్ పార్టీ నాయకులు మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడటం సిగ్గు చేటని , ఇటీవల బుట్టలంక, ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న ఒక మహిళ స్నానమాచరించడానికి వెళ్లగా, ఆ పార్టీ నేత ఆజాద్ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉన్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి సునీల్ దత్ పేర్కొన్నారు.
అనంతరం ఆ మహిళ తీవ్రమైన బాధతో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వానికి ఆజాద్ పై ఫిర్యాదు చేసినా గానీ అగ్ర నాయకత్వం అతనిని కనీసం మందలించకుండా వదిలేసారని పేర్కొన్నారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఏమి చేయాలో అర్థం కాక ఆ మహిళ కొట్టుమిట్టాడుతున్నట్లు తమకు సమాచారం ఉన్నదన్నారు .
బలవంతంగా మావోయిస్ట్ పార్టీలో చేర్చుకోబడిన అమాయకపు గిరిజన మహిళలపై ఆజాద్ లైంగిక వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడని, ఎన్నో సార్లు నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి ఆజాద్ పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధంగా మహిళల హక్కులను కాలరాస్తూ,వారిపై వేధింపులకు పాల్పడుతున్న మావోయిస్టులు మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తుప్పు పట్టిన సిద్ధాంతాల పేరుతో మావోయిస్ట్ పార్టీ నాయకుల మనుగడ కోసం అమాయకపు గిరిజనులను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుని వారిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఎస్పి వెల్లడించారు.