జిల్లా లోని మొత్తం 9.7 లక్షల గొర్రెలకు, 2 లక్షల మేకలకు ఫిబ్రవరి 22 నుండి 28 వరకు సామూహికంగా నట్టల నివారణ మందులు త్రాగించబడతాయని నాగర్ కర్నూల్ జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డాll జి.వి. రమేష్ పేర్కొన్నారు. జిల్లా లోని 20 మండలాలలో మొత్తం 150 మంది సిబ్బంది 47 జట్లగా ఏర్పడి ఈ కార్యక్రమం లో పాల్గొంటారని తెలియ చేశారు. గొర్రెల, మేకల శరీరంలో నులిపురుగులు, కార్ఖపు జలగలు,పొట్ట జలగలు , బద్దే పురుగులు మొదలయినవి ఉండటం వలన జీవాలు నీరసిస్తాయి. వీటిలో పెరుగుదల మందగించడం, రక్తహీనత, ఎద రాకపోవటం, బలహీనమైన పిల్లలు జన్మించటం, వ్యాధుల బారినపడటం మొదలయినవి సంభవిస్తాయి. జీవాలలో ఒక క్రమ పద్ధతిలో నట్టల నివారణ మందులు త్రాపించటం వలన అంతరపరాన్న జీవులు నశించి ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రతి గొర్రె ,మేక కనీసం రెండు కిలోల బరువు పెరుగతుంది. వీటిలో ఒకే ఈతలో ఎక్కువ పిల్లలు పుట్టే అవకాశం వుంటుంది. ఇతర అంటు వ్యాధులు సోకే అవకాశాలు తక్కవగా ఉంటాయి. కావున జీవాల పెంపకందార్లు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి మందలకు నట్టల నివారణ మందులు త్రాగించుకోవలసినదిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అంతర్ పరాన్నజీవుల బారిన పడకుండా మేపులో కూడా జాగ్రత్త వహించాలి. మేపిన ప్రాంతంలోనే మరల మేపకుండా కనీసం 21 రోజుల వ్యవధి పాటించినట్లయితే పరాన్నజీవి జీవిత చక్రాన్ని నశింప చేయవచ్చు ఇలా చేయటం వలన పరాన్నజీవులు నశిస్తాయి. ఇవే కాకుండా ప్రభుత్వం నుండి గొర్రెలకు చిటుక వ్యాధి,బోబ్బ రోగం, పారుడు వ్యాధి,నీలి నాలుక వ్యాధి టీకాలు,మేకలలో బొబ్బ రోగం , పారుడు వ్యాధి టీకాలు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా లోని ప్రజా ప్రతినిధులు పాల్గోని వారి విలువైన సలహాలు, సూచనలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు.