దేశ నలుమూలల్లో అత్యంత ఎక్కువమంది అట్టడుగు ప్రజలు ఆరాధించే ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్క లు దేవతలే కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని SFI నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ డిమాండ్ చేశారు. మాంసాహారం తినేవారిని అవమానిస్తూ మాట్లాడిన చినజీయర్ నేడు అట్టడుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం తన అహంభావాన్ని రుజువు చేసుకున్నాడని వారు విమర్శించారు.
దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి తన చెప్పు చేతల్లో ఉన్నారని రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆధ్యాత్మికత ముసుగులో అనేక మంది అవహేళన చేయడమే గాక అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటూ మోసాలుచేస్తున్నాడని విమర్శించారు. కులవ్యవస్థ గురించి కూడా రాజ్యాంగేతర వ్యాఖ్యలు చేశాడని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు సమ్మక్క-సారక్క లను ఎందుకు ఆరాధిస్తారని వాళ్లు దేవతలు కాదని వాళ్ళు అడవిలో ఒక సామాన్యమైన వారని, అటువంటి వారికి కోట్లాది రూపాయలు ముడుపులు ఎందుకు సమర్పిస్తున్నారని అవహేళన చేస్తూ, కించపరుస్తూ చిన్న జీయర్ స్వామి మాట్లాడారని అన్నారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో దొంగ డేరా బాబా గా మారి భక్తి ముసుగులో దేవుడే కానీ రామానుజుల వంటి వారి విగ్రహం పెట్టీ వేల కోట్ల రూపాయలు దోపిడీకీ పాల్పడుతున్నాడని విమర్శించారు. ఆదివాసీ గిరిజన సమాజాల్లో అడవుల్లో నివసిస్తున్న తమ వారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడి అమరులైన వారిని దేవతలుగా కొలిచే సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి వస్తున్నది.
అటువంటి ఆదివాసి గిరిజన దేవతలకు అతీత శక్తులు ఉంటాయని కోట్లాది మంది ప్రజల నమ్మకం. వారి నమ్మకాలను కించపరుస్తూ అవహేళన పరచడం చిన్న జీయర్ స్వామి లాంటి దొంగ బాబాలకు చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేదని తెలుస్తున్నది. పురాతన ఋగ్వేదం నుండి వైదిక పురాణ గ్రంథాలన్నిటిలోనూ ఆదివాసి వీరుల పోరాటం, దేవతలుగా కొలిచిన పద్ధతి గురించి చెప్పబడిందన్నారు. సమ్మక్క, సారక్క లను కించపరుస్తూ అవహేళన చేసిన చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.