తెలంగాణ ఉద్యమానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆద్యుడని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన త్యాగాలను మరచిపోలేమని వక్తలు అన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఆర్సీ కుంతియా తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వెంకయ్య నాయుడు చెన్నారెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెన్నారెడ్డి లాంటి గొప్ప నాయకుడు కాంగ్రెస్ నాయకుడు కావడం మాకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఆర్ సి కుంతియా అన్నారు.