ఇదిగో వస్తా అదిగో వస్తా అంటూ మంత్రులు తమ పర్యటనలు వాయిదా వేసుకుంటుండటంతో వీపనగండ్ల, పానుగల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు వాయిదా పడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కొల్లాపూర్ అంటే మంత్రులకు చిన్న చూపా లేక స్థానిక రాజకీయ నాయకుల వైఫల్యమా అనేది ఇక్కడి ప్రజలకు అర్ధం కావడం లేదు.
మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారని స్థానిక నాయకులు చెప్పారు. అయితే మంత్రి కేటీఆర్ రాలేదు. ఆయన స్థానంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వస్తున్నారని ఆ తర్వాత చెప్పారు. మంత్రి కేటీఆర్ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని కొల్లాపూర్ ప్రాంత వాసులు భావించారు.
అయితే అది జరగలేదు జిల్లా మంత్రి వస్తున్నారు కదా ఆయనతో అయినా సమస్యలు చెప్పుకుందామని అనుకున్నారు. అయితే అదీ నెరవేరలేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నందున మంత్రులు నియోజకవర్గానికి రావడానికి మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. మరోపక్క మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కొన్ని కార్యక్రమాలు ఉన్నట్లు తెలిసింది.
ఇక ఇప్పుడు ఏ మంత్రి వస్తారో తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ ప్రారంభోత్సవాలు ఆగిపోయాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల కోడ్ వచ్చినందున ఇక ఈ ఎన్నికలు అయ్యే వరకూ మంత్రులు ఇటు తొంగి చేసే వీలు కూడా ఉండదు.