అమరుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి వెల్లడి
తెలంగాణలో ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరుల కుటుంబాల నుంచి తెలంగాణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కేసీఆర్ పై 200 నామినేషన్స్ వేస్తామని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు. శుక్రవారం కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సుమారు 20 మంది అమరుల కుటుంబ సభ్యులు రఘుమారెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా రఘుమారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 1345 మంది చనిపోతే కేవలం 400 లకు పైగా అమరులను ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొంతమందికి నాల్గవ తరగతి ఉద్యోగాలు ఇచ్చారుని, మరికొంత మందికి ఐదేళ్ల తర్వాత 10 లక్షల చొప్పున ఇచ్చారని తెలిపారు. ఉద్యమ సమయంలో రైల్ రోకో, బస్ రోకో చేసిన సమయంలో 175 మంది వికలాంగులుగా మారారని, వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదన్నారు. అమరుల కుటుంబాల్లో చదువుకున్న వారికి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని, చదువుకోని వారికి ఒక్కొక్క కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు ఈ నెల 9 మధ్యాహ్నం 12:30 లోపు కేసీఆర్ తమను పిలిచి చర్చించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే అదే రోజు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేసిన మరుక్షణమే 200 మంది అమరుల కుటుంబాలు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారని, కామారెడ్డితో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లో కూడా నామినేషన్స్ వేస్తామని హెచ్చరించారు.
సత్యం న్యూస్, కామారెడ్డి