నవంబర్ 26న దేశ వ్యాప్తంగా జరగబోతున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు పరిశ్రమల యాజమాన్యం సహకరించాలని సిఐటియు సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జరపతలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాసరావుకు సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ కార్మికులను బానిసత్వం లోకి నెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు.
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా ఆరోపించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన కాలంలో అసంఘటిత రంగ కార్మికులకి నెలకి పదివేలు చొప్పున పది నెలలు ఇవ్వాలని కోరారు.
తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చే బియ్యం సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా అనంతరం శీతల రోషపతి మాట్లాడుతూ హైదరాబాదులో మున్సిపల్ కార్మికులకి పెంచిన విధంగానే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ నెలకి 17500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
2016 అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇచ్చిన తీర్పు అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని, తక్షణమే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు ముత్తమ్మ, మెరుగ దుర్గారావు, క్రాంతి, శ్రీను, సైదులు, చంద్రమ్మ, వెంకటమ్మ, కుమారి, పుల్లయ్య, గోపి, ఐ ఎన్ టి సి జిల్లా నాయకులు సలిగంటి జానయ్య, బండి వెంకటరెడ్డి, సిఐటియు నాయకులు రెడితి వెంకన్న, చింతకాయల పర్వతాలు, సైదులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.