తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ TUWJ (IJU) ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి జర్నలిస్టులు నేడు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవాలని వారు స్పీకర్ ను కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రజినీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు గా ఉద్యమం లో పాల్గొన్నామని అన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారనీ అందులో భాగంగా ఇళ్ల స్థలాలు, ఇండ్ల నిర్మాణం వంటి హామీలు ప్రకటించారని ఇప్పటికీ 6 సం అవుతున్న ఎవరికీ రాలేదని వాపోయారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులతోపాటు హెల్త్ కార్డులు ప్రభుత్వం జారీ చేసింది కాని, మూడేళ్లు అవుతున్న అవి పనిచేయడం లేదని తెలిపారు. దీంతో అప్పులు చేసి వైద్యం పొందే పరిస్థితి నెలకొందని అన్నారు. కొందరు జర్నలిస్టులు ప్రాణాలు సైతం కోల్పోయారని తెలిపారు. అన్ని ప్రైవేటు ఆస్పత్రిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లతీఫ్, ఉపాధ్యక్షుడు వెంకట రమణ, శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ ముదం వెంకటి, మోయిన్, చందు, నందు, సాయగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.