మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకూ కాలువ నిర్మాణానికి ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) అనుమతి లేకుండా కాలువను ఎలా నిర్మిస్తారని చుట్టూప్రక్కల గ్రామస్థులు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు మాట్లాడుతూ.. కాలువ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎకరానికి లక్షన్నర పరిహారమా?
కాలువ నిర్మాణంతో భూములు కోల్పోతున్నరైతులకు ఎకరాకు లక్షా యాభైవేల పరిహారం మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంతమేరకు సమంజసమన్నారు. ఏడాది పొడవునా మూడు పంటలు పండే భూములను అత్యంత చవకగా లాగేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులనోట్లో మట్టి కొడుతుందని దుయ్యబట్టారు.
చెరుకు శ్రీనివాస్రెడ్డి, గ్రామస్థుల అరెస్ట్
ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు, చెరుకు శ్రీనివాస్రెడ్డికి నచ్చచెప్పి ధర్నా విరమింప చేసే ప్రయత్నం చేశారు. ఎంతకీ రైతులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు చెరుకు శ్రీనివాస్రెడ్డిని, రైతులను అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.