అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయం అని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హవాలా ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించిన వైనంపై సమగ్ర విచారణ జరపాలని కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జీ అమీర్ బాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతల అవినీతికి నిదర్శనం దొరికిందని అన్నారు.
తమిళనాడులోని ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద రూ.5.27 కోట్ల డబ్బు, బంగారంతో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారును పోలీసులు పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడేం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెన్నైలో నివాసముంటున్న వైఎస్ భారతి బంధువు సుధాకర్ రెడ్డికి చేర్చేందుకే ఆ డబ్బు తరలిస్తున్నారని ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని ఆయన కోరారు.
పారిపోయిన మంత్రి తనయుడిని వెంటనే పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకు పట్టుబడ్డ నల్లమల్లి బాలు వైసీపీ పార్టీ నుండి ఒంగోలు నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒంగోలు కార్పొరేషన్ లోని 25వ డివిజన్ నుండి వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రస్తుతం పోటీలో ఉన్నాడని ఆయన తెలిపారు.
మంత్రి అనుచరుడు పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉండే గుమస్తాలు పట్టుబడ్డారు. డ్రైవర్లు కూడా వారి మనుషులే. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడిన తర్వాత కూడా నాకు సంబంధం లేదని మంత్రి బాలినేని ఏ విధంగా చెబుతారు? అని అమీర్ బాబు ప్రశ్నించారు.