తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడడం సరికాదన్నారు. తెలంగాణలో చూచిరాతలు, స్కాంలు వెలుగు చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన బొత్స ఈ సందర్భంగా మాట్లాడారు.
కొంతమంది మాట్లాడితే తెలంగాణ పేరు ఎత్తుతున్నారు. తెలంగాణ పరిస్థితి ఏంటో రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నే సక్రమంగా నిర్వహించలేని దుస్థితి తెలంగాణలో ఉంది. అక్కడ చూచిరాతలు, స్కాంలు జరుగుతున్నాయి. ఎంతో మంది అరెస్ట్ అవుతున్నారు.
కనీసం వారి టీచర్లను ట్రాన్స్ఫర్ చేసుకోలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. అందువల్ల ఒక రాష్ట్రాన్ని మరొక రాష్ట్రంతో పోల్చడం సరికాదన్నారు. ఎవరి విధానం వారికి ఎవరి ఆలోచన వారికి ఉంటుందన్నారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
నిజానికి ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలికల రాజకీయం చర్చనీయాంశం అవుతుంది. గతంలో ఏపీలోని మౌలిక సదుపాయాల విషయంలో బీఆర్ఎస్ మంత్రులు, నేతలు విమర్శలు గుప్పించడం దుమారం రేపింది.
అయితే ఎప్పుడూ బీఆర్ఎస్ నేతలే తొలుత విమర్శలు గుప్పిస్తుంటే ఈసారి అనూహ్యంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టీఎస్ పీఎస్సీ అంశంలో బొత్స సత్యనారాయణ కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన మధ్య తీవ్ర రాజకీయం నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మంత్రి కేసీఆర్ను టార్గెట్ చేయడం వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి అనేది ఉత్కంఠ రేపుతున్నది.