వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై చట్ట సవరణ చేసే యోచన విరమించుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. అనవసర ప్రతిష్టకు పోకుండా భారత రైతాంగ ప్రయోజనాలు, ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని మొత్తానికి మొత్తం ప్రతిపాదిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయం పట్ల సమగ్ర అవగాహన కలిగిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో దేశంలో అందరికన్నా ముందే మోటార్లకు మీటర్ల బిగింపును వ్యతిరేకించారని మంత్రి గుర్తు చేశారు.
కేవలం రాజకీయ కోణంలో చూసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు గానీ, వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయడం గానీ, పంటల కొనుగోళ్లలో మాట తప్పిన విషయం గానీ, స్వామినాధన్ కమిటీ సిఫార్సుల మేరకు తూచా తప్పకుండా పంటలకు మద్దతుధరలు ప్రకటించడంలో కూడా కేంద్రం విఫలమయిందని మంత్రి అన్నారు.
మోటార్లకు కరంటు మీటర్ల బిగింపు విషయంలో , వరి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలు కేంద్రప్రభుత్వం తలకెక్కకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం మొండి కేసినప్పుడు కేసీఆర్ అనుకోకుండా దేశంలో ఇక్కట్లు వస్తే భారతదేశ ప్రజలకు అన్నం పెట్టే శక్తి ప్రపంచంలోని ఏ దేశానికి లేదని తేల్చిచెప్పారని మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ ధాన్యం కొనడానికి నిరాకరించి, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని చెప్పిన పీయూష్ గోయల్ ఇప్పుడు దేశంలో వరి సాగు పెంచాలని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలను, రైతులను వేధిస్తూ ఇలాంటి ప్రకటన చేయడం కేంద్రానికి రైతుల విషయంలో, వ్యవసాయం విషయంలో, కొనుగోళ్ల విషయంలో నిర్దిష్ట విధానం లేదన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నదని ఆయన అన్నారు.
విద్యుత్ చట్టంలో రైతుల మోటార్లకు మీటర్లను పెట్టడం విషయంలో సవరణలకే పరిమితం కాకుండా పూర్తి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై కేంద్రం సవరణలు చేస్తుందన్న సమాచారం, ఆహారమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో వరి సాగు పెంచాలన్న కేంద్ర మంత్రి సూచనల నేపథ్యంలో అధిక సాంద్రతలో పత్తి సాగు – యాంత్రీకరణపై అమెరికాలో అద్యయన పర్యటన నుండి ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.