తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లే బస్సులను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రధాన బస్ స్టేషన్ వద్ద శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించనున్నారు.
ప్రతిరోజు 1000 వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు బస్ టికెట్తో పాటే తిరుమల శీఘ్ర దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పిస్తున్నామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు.
తిరుమల వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పించడం విశేష పరిణామమని ఆయన అన్నారు. దీనివల్ల టి.ఎస్.ఆర్టీసీకి యాత్రికుల ఆదరణ మరింత పెరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. టి.ఎస్.ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉంది.
తిరుపతి నుంచి తిరుమలకు అక్కడి స్థానిక బస్సులో తీసుకెళ్లి ఉదయం 10 గంటలకు శీఘ్ర దర్శనం కల్పించనున్నారు. ఈ దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం ఉంది. అయితే బస్ టికెట్తోపాటే దర్శన టికెట్నూ బుక్ చేసుకోవాలి. తిరుమల శ్రీవారి దైవ దర్శనం కోసం ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటుందని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
మరిన్ని వివరాల కోసం టి ఎస్ ఆర్ టి సి వెబ్సైట్ను సందర్శించండి. www.tsrtconline.in ఆన్ లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చంటూ కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని టి.ఎస్.ఆర్టీసీ బస్సులో ప్రయాణించే భక్తులు వినియోగించుకోవాలని కోరారు.