ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజీగూడా కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందిన ఆకుల రమేష్ గౌడ్ కరోనా బారిన పడి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు మరణించారు.
ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల రమేష్ గౌడ్ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తీవ్రంగా శ్రమించారు. అలాగే మహిళలకు సంబంధించి డ్వాక్రా గ్రూప్ల అభ్యున్నతి కోసం క్రుషి చేశారు.
ఇటీవల GHMC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లింగోజిగూడ బీజీపీ కార్పొరేటర్ ఆకుల రమేశ్ గౌడ్ అకాల మరణం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, నిరుపేద వర్గాలకు తీరని ఆశనిపాతమని, అత్యంత దురదృష్టకరమని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, పేదల సంక్షేమం కోసం పాటు పడే రమేష్ మరణం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. బీజేపీలో 1983 నుంచి రమేష్గౌడ్ క్రియాశీలంగా పనిచేశారని, ఎల్బీ నగర్ మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆకుల రమేశ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థించారు.
రమేష్ గౌడ్ మరణంతో లింగోజీగూడాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే జీహెచ్ఎంసీలో గెలుపొంది తమకు పలు నిర్ణయాలకు సంబంధించి మాట ఇచ్చారని ఆయన మరణం తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని పేర్కొన్నారు.
లింగోజీగూడ నుంచి మొత్తం జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది మంది పోటీ చేశారు. ఇందులో రమేష్ గౌడ్ 10340 ఓట్లతో విజయం సాధించారు. ఈయనకు సరిసాటి కనీసం పోటీదిశలో కూడా ఆ డివిజన్లో ఎవ్వరూ రాలేకపోవడం విశేషం. కాగా గెలిచిన అనంతరం చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయాన్ని కూడా బీజేపీ పార్టీ తరఫున అందరూ కార్పొరేటర్లతోపాటు రమేష్గౌడ్ సందర్శించారు. కాగా గెలుపొందిన కార్పొరేటర్లకు ఫిబ్రవరి వరకూ గడువు ఉండడంతో, రమేష్ గౌడ్ పదవీని చేపట్టకముందే మరణించడంతో డివిజన్ ప్రజలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీ నాయకులు పార్టీలకతీతంగా తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.