విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే హాస్టళ్ల పై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కూకట్ పల్లి లోని రోడ్ నెంబర్ 2 లో గల శివాని హాస్టల్ లో సరైన ఫుడ్ ఇవ్వడంలేదని ఒక విద్యార్థిని మంత్రికి ఫోన్ లో ఫిర్యాదు చేశారు.
స్పందించిన మంత్రి వెంటనే స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లతో ఫోన్ లో విషయాన్ని తెలిపి విద్యార్థినుల ఇబ్బందులు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జోనల్ కమిషనర్ మమత కు ఫోన్ చేసి సంబంధిత హాస్టల్ వద్దకు వెళ్లి విచారణ జరిపించాలని ఆదేశించారు. దీంతో వెంటనే జీహెచ్ ఎంసి అధికారులు హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ సక్రమంగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హాస్టల్ నిర్వాహకులను హెచ్చరించారు.