ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలు, ముంపునకు గురైన ప్రాంతాలలో బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు.
మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హన్మంతు కె జండగే, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు పల్ల బుచ్చయ్య, జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, ఏ ఎస్పీ సాయి చైతన్య అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
ములుగు జిల్లాలోని జాకారంలో బుధవారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, అనంతరం రామప్పలో, పాపయ్యపల్లిలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించి, బాధితులను పరామర్శించారు.
గతంలో లేనివిధంగా భారీ వర్షాలు రావడం వల్ల ఈసారి పరిస్థితి విషమించిందని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు.
త్వరలోనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండాలనే ఉద్దేశ్యంతో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఒకటన్నారు.
గోదావరి నది తలాపున ఉన్న ములుగు జిల్లాలో ఇంకా సాగునీటికి ఇబ్బందులుండకూడదనే, సమృద్ధిగా పంటలు పండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి ఎకరాకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందిని కూడా ఈ ప్రభుత్వం లేకుండా చేస్తుందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.