హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని సర్వే నెంబర్ 336 ప్రభుత్వ భూమిలో యధేచ్చగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల విషయం కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి వాస్తవ పరిస్థితిని ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి తహసీల్దార్ సంజీవ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్య ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ 336 ప్రభుత్వ భూములలో కొందరు స్వార్థపరులు రెవెన్యు అధికారుల అండ తో చెలరేగిపోతున్నారని, డిప్యూటీ తసీల్ధార్ అశ్విన్ స్థానిక నేత అస్లాం మా వద్ద డబ్బులు తీసుకోని ఇండ్లను కట్టిస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు.
తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ భూమి రక్షించాల్సిన అధికారులే ప్రభుత్వ భూమిని కబ్జాదారులకు అంటగట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఇలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. గజం ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని ఆయన అన్నారు.
చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం చేసేందుకు సహకరించే అధికారులపై చర్యలు ప్రభత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలియ చేసారు. వివాదాస్పద భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు చేపట్టారదని, ప్లాట్ లు కొని మోసపోవద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎవరైనా క్రయ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రామకృష్ణ గౌడ్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.