క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. ఈ వ్యసనానికి బానిస అయినవారిని టార్గెట్ చేసుకుంటూ డబ్బు కొల్లగొట్టే ముఠాలు తయారవుతున్నాయి. విజయవాడ నగర పరిసర ప్రాంతాలలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులు దృష్టి సారించడంతో ఒక ముఠా దొరికింది.
నగర పోలీస్ కమీషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు ఆదేశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టిన టాస్క్ ఫోర్సు ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు, ఏసిపి వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్, మసీద్ వీధిలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని చట్ట వ్యతిరేకంగా క్రికెట్ బెట్టింగా నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు దాడి చేయగా ఇంటిలో నలుగురు దొరికారు.
విజయవాడ, మసీద్ వీధికి చెందిన పైలా ప్రసాద్(33) పశ్చమగోదావరి జిల్లా, కైకారంకు చెందిన సిరిబత్తుల కళ్యాన్ చక్రవర్తి(37) విజయవాడ, మొగల్ రాజ్ పురానికి చెందిన మాదేటి మోహన్ కృష్ణ(37) విజయవాడ, కృష్ణలంకకు చెందిన ఉండి శరత్ చంద్ర(25) క్రికెట్ బెట్టింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయారు.
వీరి నుంచి రూ.16 లక్షల 2 వేలు నగదు, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగే విధంగా ఎటు వంటి అసాంఘిక కార్య క్రమాలకు అవకాశం ఇవ్వ కుండా విజయవాడను నేరరహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీపీ ద్వారకా తిరుమలరావు సారధ్యంలో పోలీస్ శాఖ పలు చర్యలు తీసుకుంటున్నది.
ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ ల పై వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరంలో నిఘా పెంచారు. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించడంతో బాటు దాడులు నిర్వహించి బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విధి నిర్వహణలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందినిలను సీపీ అభినందించారు.