విజయనగరంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సాయి అన్నపూర్ణ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శుద్ధ జల కేంద్రాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి మూల విరాట్ ను దర్శించుకున్న అనంతరం శుద్ధ జల కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ఈ ఏడాది పైడితల్లమ్మ జాతర ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు. అమ్మవారి పై భక్తి ప్రపత్తులతో ఉన్న భువనేశ్వర్ కు చెందిన దంపతులు శుద్ధ జల కేంద్రాన్ని తమ సొంత నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి పరచేందుకు పరిసర ప్రాంతాల వారు తమ స్థలాలను అందివ్వడం ముదావాహమన్నారు.
ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో స్థలదాతలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కిషోర్ కుమార్, కార్పొరేటర్ గుజ్జుల నారాయణరావు, వైఎస్ఆర్పీ నేతలు ఎవర్ణ కుమారస్వామి, పిజె మహేష్,ఆలయ కమిటీ సభ్యులు పతివాడ వెంకటరావు, మల్ల వెంకటేశ్వరరావు (ఎం. కే.బి), వేత్స శ్రీను, బలివాడ పార్వతి, చిల్ల పుష్ప, గొర్లె ఉమా, నక్క జ్యోతి, రామ్ సింగ్ సూరమ్మ, పార్టీ నాయకులు పూసర్ల అప్పారావు, గొర్రె దేవదాస్, గంధం హరిబాబు, బలివాడ కాశి, చిల్లా వాసు తదితరులు పాల్గొన్నారు.