కరోనా వైరస్ పరీక్షలు జరిపే ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్ల కు సంబంధించి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం చెల్లిస్తున్న ధరనే చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాపిడ్ కిట్ల కొనుగోలులో దాదాపుగా 8 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో భాస్కర్ ఈ వివరణ ఇచ్చారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కన్నా ఎక్కువ ధర చెల్లించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాపిడ్ కిట్లను కొన్నదని ఇది పెద్ద కుంభకోణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మంత్రి బహిరంగపరచిన రేటుకే తాము కూడా కొనుగోలు చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు.
దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ నుంచి కరోనా ర్యాపిడ్ కిట్లను ఏపీ దిగుమతి చేసుకుందని, దక్షిణ కొరియా కంపెనీకి చెందిన మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మన దేశంలో ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చే నాటికి దేశంలోని ఆ కంపనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కు అనుమతి రాలేదని ఆయన వివరణ ఇచ్చారు.
ఇండియాలోని ఆ కంపెనీ యూనిట్ నుంచి ఛత్తీస్ గఢ్ కొనుగోలు చేసిందని భాస్కర్ తెలిపారు. ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకు ఇస్తే అదే ధర ఇస్తామని తమ ఒప్పందంలో ఉందని అందువల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన అన్నారు.