చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా? అని నగరి టీడీపీ ఇంచార్జి గాలి భాను ప్రకాష్ ప్రశ్నిస్తున్నారు. దేశం అంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నారని ఆయన విమర్శించారు.
మంగళవారం నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు మున్సిపాలిటీ సుందరయ్య నగర్ లో బోరు ప్రారంభోత్సవంకు హాజరై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అన్నారు. గుంపులుగా వైసీపీ కార్యకర్తలు హాజరై పూలు చల్లుతుంటే వాటిని తొక్కకుంటూ ఆమె వెళ్లారని పేర్కొన్నారు.
ఓ వైపు కరోనా కట్టడికి ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావద్దని,వస్తే కేసును పెడతామని హెచ్చరికలు జారీ చేస్తారు, వైసీపీ వాళ్లకు ఆ హెచ్చరికలు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే కరోనా సాయాన్ని ప్రచారం గా మార్చుకుంటూ రెడ్ జోన్ ఏరియాలలో అధికారులను, వైసీపీ నాయకులను వెంటబెట్టుకొని తిరుగుతూ కరోనా వైరస్ వ్యాప్తికు కారకులవుతున్నారని పేర్కొన్నారు. ట్రస్ట్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసుకుని తన సొంత నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం 5 మండలాలకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదని, మాస్క్ లు, ఇతర పరికరాలు ఎమ్మెల్యే నే అందిస్తున్నదని అధికారుల ద్వారా చెప్పించుకుని వారి సస్పెన్షన్ కు కారణమయ్యారని ఆయన అన్నారు.