ఆంధ్రా తెలంగాణ కు బోర్డర్ గా ఉన్న ఖమ్మం జిల్లాలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. అటు పక్కా ఇటు పక్కా కరోనా కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం ఉదాసినం గా ఉన్నా కరోనా ప్రభావం తప్పదనే వాతావరణం నెలకొని ఉంది.
కొత్తగూడెం లో ఒక పోలీసు అధికారి అజాగ్రత్త వల్ల కరోనా కోరల్లోకి వెళ్లి వచ్చిన ఖమ్మం ప్రాంతం ఇప్పుడు సురక్షితంగా ఉంది అయితే పక్కనే ఉన్న సూర్యాపేట ఇప్పుడు కరోనా కేసులతో సతమతం అవుతున్నది. సూర్యాపేట నుంచి ఖమ్మం కు ప్రతి నిత్యం రాకపోకలు ఉంటాయి.
అదే విధంగా మరో వైపు ఉన్న ఆంద్రప్రదేశ్ లోని సరి హద్దు గ్రామాలు రెడ్ జోన్లు గా సోమవారం రాత్రి అక్కడి కలెక్టర్ ప్రకటించారు. ఎర్రుపాలెం మండలం సరిహద్దుల్లో ని బొమ్మల కొండపల్లి, కల్లూరుకు కూతవేటు దూరం లో ఉన్న తిరువూరు, మధిర మున్సిపాలిటీ కి అత్యంత సమీపం లో ఉన్న నందిగామ, బోనకల్లు ముదిగొండ మండలానికి సరిహద్దుల్లో ఉన్న వత్సవాయి, పెనుగంచి ప్రోలు ను కూడా అక్కడి అధికారులు రెడ్ జోన్స్ గా ప్రకటించారు.
పై ప్రాంతాలకు ఖమ్మం జిల్లా నుండి వందల సంఖ్యలో జనం రాకపోకలు సాగిస్తారు. నిత్యం అనేక రకాలు అయిన లావాదేవీలు నిర్వహిస్తారు. పై ప్రాంతాలకు ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాలకు రాకపోకలకు అనేక సందు రోడ్లు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో జనం ఉదాసీనంగా ఉండకుండా స్వీయ నియంత్రణ పాటించక పోతే ఖమ్మం జిల్లా కు ప్రమాద ఘంటికలు తప్పవు అనేది స్పష్టం అవుతోంది.