ఏపీ రాష్ట్ర పురపాలక,పట్టణ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం 4 వ తేదీన రాత్రి విజయనగరంకు చేరుకున్నారు.
ఉదయం నగరంలోని వీఎంసీలో కొత్త కార్పొరేషన్ హాలు ప్రారంభోత్సవం అయిన తర్వాత అక్కడ నుంచీ తన సొంత నియోజక వర్గమైన చీపురుపల్లిలో…12కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ డిగ్రీ కళాశాల, హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుక కృషి చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ప్రతీ విద్యార్థికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలని ఆయన సూచించారు.తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతిస్తున్న అంశాల్లో విద్యారంగం ఒకటని. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.
నాడూ-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలే పూర్తిగా మారిపోయాయని, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తయారు చేయడం జరిగిందని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులతో పేద ప్రజలు విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో, ప్రభుత్వం విద్యాకానుక, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన మొదలగు పథకాలను అమలు చేస్తూ, విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు.
ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని, విద్యార్థులు బాగా చదివి, ఉన్నత స్థానానికి ఎదగాలని మంత్రి కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సి పెనుమత్స సురేష్బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, ఉన్నతవిద్య ఆర్జెడి డాక్టర్ టి.కృష్ణ, వైఎస్ఆర్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ రూపవాణి, స్థానిక అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.